Breaking News

మకరతోరణం.. విశేషం

మకరతోరణం.. విశేషం

ఆలయాల్లో దేవతా విగ్రహాల వెనక అమర్చిన తోరణ మధ్యభాగంలో కన్నుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసుడి ముఖం కనిపిస్తుంది. దీనికే ‘మకర తోరణం’అని పేరు. ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చడానికి గల కారణాలను స్కంద మహాపురాణంలో ఓ కథ ఉంది.  పూర్వం ‘కీర్తిముఖుడు’ అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొంది.. తద్వారా వచ్చిన బలపరాక్రమంతో సమస్త భువనాల్లోని సకల సంపదలను సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుడి పత్ని అయిన ‘జగన్మాతను’ కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతడిని మింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుడి ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమ సాగింది.

కీర్తిముఖుడు

 మరణం లేకుండా వరం పొందినా, శివుడి ఆఙ్ఞ మేరకు ఆబడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందోననే భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్నిప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుడిని శరణు వేడుకున్నాడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించడం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడట.

మకరతోరణం

   ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉందని, తను తినడానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుడిని కోరాడు. యుక్తిగా శివుడు ‘నిన్ను నువ్వే తిను’అని చెప్పాడట. శివుడి ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోకభాగం నుంచి.. కంఠం వరకు తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు.

  ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు ‘ఇప్పటి నుంచి అన్ని ఆలయాల్లో దేవతామూర్తుల వెనక భాగంలోని తోరణ అగ్రభాగాన్ని అలంకరించి, దైవదర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారం, ఆశను తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు’ అని వరమిచ్చాడు.

 నాటినుంచి కీర్తిముఖుడు ఆలయాల్లోని దేవతా విగ్రహాల వెనక ఉన్న తోరణాల మధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తుల్లో ఉండే దుష్టవికారాలు, అహంకారం, దురాశను కబళిస్తున్నాడు. ఈ కారణంగానే దేవతామూర్తుల వెనక మధ్య భాగంలో అమర్చిన తోరణానికే ‘మకరతోరణం’ అని పేరు వచ్చింది.

– ఆనంద్​శర్మ, అలంపూర్​ 96660 06418