![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/pak.jpg?fit=926%2C517&ssl=1)
కరాచీ: వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రెండు కొత్త నియామకాలు చేపట్టింది. మాజీ సారథి యూనిస్ ఖాన్, స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ ను బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ గా నియమించింది. ‘బ్యాటింగ్ లో మంచి రికార్డు ఉన్న యూనిస్ ఆధ్వర్యంలో పాక్ బ్యాటింగ్ తీరు మెరుగవుతుందని భావిస్తున్నాం. ఆటపై అతనికి చాలా అవగాహన, అంకితభావం ఉంది. ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల్లో అతని సేవలు పాక్ జట్టుకు లాభిస్తాయి. ఇక ముస్తాక్ కు కౌంటీల్లో ఆడిన అనుభవం చాలా ఎక్కువ. అక్కడి పిచ్లపై మంచి పట్టు ఉంది. ఈ ఇద్దరి సేవలతో పాక్ టెస్ట్ సిరీస్ లో గణనీయంగా రాణిస్తుందని మేం ఆశిస్తున్నాం’ అని పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం జులై 30 నుంచి పాక్.. ఇంగ్లండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆగస్ట్ 29 నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. పాక్ తరఫున 118 టెస్టులు ఆడిన 42 ఏళ్ల యూనిస్ 10 వేలకు పైగా పరుగులు సాధించాడు. కెరీర్ లో అత్యధిక స్కోరు (313)తోపాటు ఐసీసీ నంబర్వన్ ర్యాంక్ను కూడా కైవసం చేసుకున్నాడు. ముస్తాక్ 52 టెస్ట్ ల్లో 185 వికెట్లు పడగొట్టాడు.