![నిండిన నాగార్జున సాగరం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/sagar-33f.jpg?fit=677%2C454&ssl=1)
- 575 అడుగులకు చేరిన నీటిమట్టం
- నేడు సాగర్ గేట్లు ఎత్తివేసే అవకాశం
నాగార్జునసాగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి వరద ఉధృతి పెరగడంతో నాగార్జునసాగర్ తొణికిసలాడుతోంది. శ్రీశైలం జలాశయం 10గేట్లు ఎత్తివేసి దిగువకు 3.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం నాగార్జునసాగర్ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 575.70 అడుగుల వద్ద ఉంది. 585 అడుగులకు చేరితే గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 271.37 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి దిగువకు విడుదల పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రానికే పూర్తిస్థాయి మట్టానికి చేరుకుంటుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. శుక్రవారం రాత్రి గేట్లు తెరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల నిలకడగా ఉంది. నారాయణపూర్ నుంచి 2.73 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వస్తోంది. జూరాల నుంచి ప్రతి మూడు గంటలకు వరద పెరుగుతోంది.