Breaking News

ధోనీలో ఆ కసి లేదు

న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లాండ్​తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్​లో భారత్ జట్టు గందరగోళంగా ఆడిందని ఆల్​ రౌండర్​ బెన్ స్టోక్స్ అన్నాడు. లక్ష్యఛేదనలో సూపర్ ఫినిషర్ ధోనీలో కసి కనిపించలేదన్నాడు. ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్ 337/7 స్కోరు చేస్తే.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది. ‘ఈ మ్యాచ్​ మొత్తంలో ధోనీ, జాదవ్ బ్యాటింగ్ వింతగా అనిపించింది. ఈ ఇద్దరిలో ఏమాత్రం కసి కనిపించలేదు. భారీ సిక్సర్ల కొట్టాల్సిన సమయంలో సింగిల్స్ తీయడంపై దృష్టిపెట్టారు. 11 ఓవర్లలో 112 పరుగులు చేయాల్సిన దశలో మహీ క్రీజులోకి వచ్చాడు. మామూలుగా ఈ స్కోరు అతనికి పెద్ద విషయమే కాదు. ధోనీ కుదురుకుంటే మరో 12 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేజ్ చేసేవాడు. ఎందుకోగానీ అతనిలో కసి లోపించింది. కనీసం జాదవ్ బ్యాట్ ఝుళిపిస్తాడనుకుంటే అతనూ వెనకడుగు వేశాడు. గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్​లో దూకుడుగా ఆడడమే నా దృష్టిలో సరైంది. నేను ఎక్కువగా దీనినే అనుసరిస్తాను.

మ్యాచ్ ఆరంభంలో రోహిత్, విరాట్ ఆట కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. 27 ఓవర్లు క్రీజులో ఉండి 138 పరుగులే చేశారు. దీనివల్ల లోయర్ ఆర్డర్​పై ఒత్తిడి పెరిగింది. మా బౌలింగ్ అద్భుతంగా ఉందని తెలుసు. కానీ ఈ ఇద్దరు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు భారీ టార్గెట్ ఉన్నప్పుడు చాలా భిన్నంగా ఆడతారు. అలాంటిది ఈ మ్యాచ్​లో వాళ్లిద్దరూ తేలిపోయారు’ అని ఫ్లింటాఫ్ వివరించాడు. మైదానం బౌండరీ లైన్ సైజ్​పై కోహ్లీ చేసిన వ్యాఖ్యలను కూడా ఫ్లింటాఫ్ తప్పుబట్టాడు. ఏ బ్యాట్స్​మెన్​ కూడా ఇలాంటి చెత్త ఫిర్యాదులను చేయడని విమర్శించాడు.