Breaking News

తీవ్ర తుఫాన్​గా ‘నిసర్గ’

  • ముంబై వద్ద దాటిన తీరం
  • గంటకు 110 కి.మీ.ల వేగంతో గాలులు
  • ప్రజలంతా ఇంట్లోనే ఉండండి: ప్రభుత్వం
  • లక్షలాది మందిని పునరావాసాలకు తరలింపు

ముంబై: నిసర్గ తుఫాన్​ బుధవారం ఉదయం తీవ్రరూపం దాల్చింది. ఇది తీవ్ర తుఫాన్​గా మారిందని వాతావరణ అధికారులు చెప్పారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఇది కొనసాగుతోందని, బుధవారం మధ్యాహ్నం హరిహరేశ్వర్‌‌, దామన్‌ మధ్య అలీబాగ్‌కు సమీపంలో తీరం దాటింది. దీంతో మహారాష్ట్రలో భారీవర్షాలు కురిశాయి. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో గాలులు వీచాయని అధికారులు చెప్పారు. ఇప్పటికే కరోనాతో అతలాకుతలమవుతున్న ముంబై సిటీని ‘నిసర్గ’ తుఫాను వణికిస్తోంది. వారం పదిరోజుల వ్యవధిలో దేశం ఎదుర్కొంటున్న రెండో తుఫాను ఇది. వందేళ్ల తర్వాత ముంబైకి తుఫాను ముప్పు రావడం ఇదే.
జనం రెండ్రోజులు బయటకు రావద్దు: సీఎం ఉద్ధవ్‌ థాక్రే
నిసర్గ తుఫాన్​ ప్రభావం ఎక్కువగా ఉండడంతో జనం రెండ్రోజుల పాటు బయటకు రావొద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే విజ్ఞప్తిచేశారు. భారీగాలి, వర్షాల కారణంగా పవర్‌‌ కట్‌ ఉంటుందని, దానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ముందుగానే సెల్‌ఫోన్లు, చార్జింగ్‌ లైట్లు సిద్ధంగా పెట్టుకోవాలని అన్నారు. లక్షలాది మందిని పునరావాస కేంద్రాకుల తరలించారు. తుఫాన్​ను ఎదుర్కొనేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కరోనా పేషంట్లను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెప్పారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన, చేయకూడని పనులకు సంబంధించి బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ కొన్ని సూచనలు జారీచేసింది. రూమర్స్‌ నమ్మొద్దని అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది. ముంబైలో సహాయక చర్యలకు 30 ఎన్డీఆర్‌‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ టీమ్స్‌ కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. తుఫాను ప్రభావం గుజరాత్‌పై కూడా ఎక్కువగా ఉందన్నారు. ఈ మేరకు అక్కడ కూడా చర్యలు అనేక చర్యలు చేపట్టారు. సముద్ర తీరంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్ర, గుజరాత్‌ సీఎంలతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని గురించి ఆరా తీశారు.