- టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్మెన్ కైఫ్
న్యూఢిల్లీ: సరిగ్గా పనిచేసి ఉంటే ఆసీస్ మాజీ బ్యాట్స్మెన్ గ్రెగ్ చాపెల్.. టీమిండియాకు అత్యుత్తమ బ్యాటింగ్ కోచ్ అయి ఉండేవాడని మహ్మద్ కైఫ్ అన్నాడు. తన స్వయంకృతాపరాధం వల్లే పదేపదే తప్పులు చేస్తూ పేరును చెడగొట్టుకున్నాడన్నాడు. భారత్కు జాన్ రైట్ ఇచ్చిన వారసత్వాన్ని నిలబెట్టలేకపోయాడని విమర్శించాడు. ‘చాపెల్ రాగానే జట్టులో బేధాభిప్రాయాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాడు. గంగూలీని కెప్టెన్సీ నుంచి తీసేయడం, క్రమంగా టీమ్కు దూరం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి.
టీమ్ను సమష్టిగా ఉంచడంలో విఫలమయ్యాడు. మన సంస్కృతిని, సంప్రదాయాలను అర్థం చేసుకోలేకపోయాడు. మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాపెల్లో లేవు. అందుకే ప్రతి ఒక్కరి బలహీనతలను ముందుకు తీసుకొచ్చి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ప్రవర్తించాడు. ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చే ఒక్క అంశం చాపెల్ కోచింగ్లో లేవు.
అందుకే కోచ్గా తనకు తానుగా అతను విఫలమయ్యాడు’ అని కైఫ్ పేర్కొన్నాడు. టీమిండియాను సమర్థవంతంగా గాడిలో పెట్టిన ఘనత జాన్ రైట్కే చెందుతుందన్నాడు. ప్లేయర్లు, కెప్టెన్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు అందరి మధ్య మంచి సమన్వయం ఉండేలా చూసేవాడన్నాడు. ఈ నిర్ణయాల వల్లే భారత్ బాగా విజయవంతమైందని కైఫ్ చెప్పుకొచ్చాడు.