Breaking News

ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తోంది

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్​పై తుది నిర్ణయం తీసుకోవడంలో.. ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తోందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ వల్ల కాదని చెప్పినా.. ఐసీసీ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ‘నిర్వాహణ దేశమే వద్దు అంటుంటే.. ఐసీసీ మరో ప్రత్యామ్నాయాన్ని చూస్తుందా? ఎందుకీ నాన్చుడు ధోరణి. నిర్ణయాన్ని ప్రకటించే హక్కు ఐసీసీకి ఉన్నా.. ఇతర దేశాల సిరీస్లు, ప్లేయర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిర్ణయం ఎంత ఆలస్యమైతే.. అంతర్జాతీయ షెడ్యూల్ అంత ఇబ్బందులకు గురవుతుంది’ అని ధుమాల్ వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే.. అదే విండోలో ఐపీఎల్​ను నిర్వహిస్తామని ధుమాల్ స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. పరిస్థితులను బట్టి వేదికను నిర్ణయిస్తామని వెల్లడించాడు.