Breaking News

ఏడాది దాకా కొత్త స్కీమ్‌లు ఉండవ్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది కొత్త స్కీంలు ఏవీ ప్రారంభించేది లేదని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం స్పష్టంచేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖర్చు కూడా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కొత్త స్కీంలు ప్రారంభించాలని రిక్వెస్ట్‌లు పంపొద్దని అన్ని మంత్రిత్వ శాఖలకు చెప్పామన్నారు. కేవలం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్‌ ప్యాకేజీ, ఆత్మనిర్భర‌ భారత్‌ ప్యాకేజీ కోసం మాత్రమే నిధులు ఖర్చుచేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరే కొత్త స్కీంలను ప్రవేశపెట్టబోమని సీతారామన్‌ అన్నారు. ‘కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజా ఆర్థిక వనరులపై చాలా ఎక్కువ డిమాండ్‌ ఉంది. అభివృద్ధి చెందుతున్న, మారుతున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె అన్నారు. బడ్జెట్‌ కింద ఆమోదించిన స్కీంలను కూడా మార్చి 31 వరకు నిలిపేయనున్నారు. ఈ రూల్స్‌కు సంబంధించి ఎలాంటి మినహాయింపులను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెన్‌డిచర్‌‌ ఆమోదించకూడదు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇబ్బందుల్లో పడ్డ వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆత్మనిర్భర్‌‌ భారత్‌ పేరుతో రూ.20.97లక్షల కోట్ల ఎకనామిక్‌ ప్యాకేజీ ప్రకటించింది.