Breaking News

ఎవరీ లతాకరే

అనారోగ్యంతో బాధపడుతున్న భర్త ప్రాణాలు కాపాడుకోవాలన్నది లక్ష్యం ఆమెది.. తన ఐదోతనాన్ని నిలుపుకోవడం కోసం వయస్సను సైతం లెక్కచేయకుండా ‘మారథాన్’లో పాల్గొన్నది. లక్ష్యం ముందు తన కాళ్లకు గుచ్చుకుంటున్న రాళ్లూరప్పలు కనిపించడం లేదు.. అదే లక్ష్యం.. అదే వేగం.. అదే పరుగు .. బారామతి ప్రజల చప్పట్లు ఆమెను మరింత ఉత్సాహపరిచాయి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆరుపదుల వయస్సలోనూ లతా కరే మారథాన్విజేతగా నిలిచింది. ఒక్కసారి కాదు.. వరుసగా మూడేళ్ల పాటు ‘బారామతి మారథాన్’లో విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చింది మహారాష్ట్రకు చెందిన ఈ 72 ఏళ్ల లతా కరే.

భర్త కోసం పరుగు…

ఎవరీ లతాకరే

  • మహారాష్ట్రలోని బుల్దాన జిల్లా పింప్లీ గ్రామానికి చెందిన లతా భగవాన్ కరే దంపతులకు నలుగురు కూతుళ్లు. ఏళ్ల తరబడి కూలీనాలీ చేసి కూడబెట్టిన డబ్బుతో కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించారు. అందుకోసం చేసిన అప్పులు ఆమె కుటుంబానికి భారంగా మారాయి. అప్పులు తీర్చేందుకు భార్యాభర్తలు కష్టపడుతున్న సమయంలో అనుకోని ఆపద వచ్చి పడింది. భర్త భగవాన్కరే ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో లతా కరే ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. ఏదో ఇన్ఫెక్షన్సోకి ఉంటుందని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తే గాని అసలు విషయం ఏమిటో తెలుస్తుందని చెప్పడంతో ఆమె ఆందోళనకు గురైంది. రెండు రోజుల్లోనే భర్త నడవలేని స్థితికి చేరుకున్నారు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక తనలో తాను మదనపడింది. భర్తను ఎలాగైన కాపాడుకోవాలనే ఆరాటంతో బంధువులు, చుట్టుపక్కల వాళ్ల దగ్గరకెళ్లి సాయం అందించాలని వేడుకుంది. ఎంతో కొంత అందిన సాయంతో భర్తను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేయాలంటే రూ.5వేల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమె గుండె ఆగినంత పనైంది. హృదయవిదారకంగా రోదిస్తూ ఆ రోజంతా బారామతి ఆసుపత్రి వరండాలోనే ఉండిపోయిందామె.

పేపరు ప్రకటనే ప్రాణం పోసింది

  • భర్త ఆకలిగా ఉందని చెప్పడంతో లతా కరే ఆస్పత్రి బయట రోడ్డు చివరన ఉన్న ఓ కొట్టు వద్దకు వెళ్లి తన దగ్గర ఉన్న కొద్దిపాటి చిల్లరతో రెండు సమోసాలు తీసుకొచ్చి తినమని భర్తకు ఇచ్చింది. సమోసాలు చుట్టిన పేపరులో మరాఠీలో పెద్ద పెద్ద అక్షరాలతో కూడిన ప్రకటన లతా కరే కంటపడింది. ‘బారామతి మారథాన్లో పాల్గొనండి.. రూ.3వేలు నగదు గెలుచుకోండి’ అనేది ఆ ప్రకటన సారాంశం. రాత్రంతా తెగ ఆలోచించి.. మారథాన్లో పాల్గొని రూ.3వేలు గెలుచుకోవాలనుకుంది. ఆ డబ్బుతో భర్తకు వైద్యం చేయించాలని గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు (2013 డిసెంబర్17న) బారామతి మారథాన్ప్రారంభం కావడానికి సిద్ధమైంది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అనేక మంది మహిళలు స్పోర్ట్స్దుస్తులు, షూ ధరించి పరుగుకు సిద్ధమయ్యారు. అప్పుడే లతా కరే 9గజాల నేత చీరతో, పాదాలకు కనీసం చెప్పులు కూడా లేకుండా మారథాన్జరిగే ప్రదేశానికి చేరింది. పోటీల్లో పాల్గొనేందుకు తనకు కూడా అవకాశం ఇవ్వాలని నిర్వాహకులను కోరింది. అందుకు వాళ్లు నిరాకరించారు. అయితే పరిస్థితిని వివరించి వేడుకోవడంతో నిర్వహకులు ఎట్టకేలకు అనుమతి ఇచ్చి చివరి వరుసలో నిలబెట్టారు. ‘తాను ఎక్కడ నిలుచున్నాను అనేది కాదు… ఎలాగైనా రూ.3వేలు గెలుచుకుని తన భర్తకు వైద్యం చేయించాల’నే టార్గెట్ఒక్కటే ఆమె కళ్ల ముందు కనిపించింది. పరుగుపందెం మొదలైంది.. భర్తపై లతా కరేకు ఉన్న ప్రేమకు అక్కడివారంతా జేజేలు పలికారు. అప్పటికప్పుడు మారథాన్నగదు ప్రైజు రూ.3వేల నుంచి రూ.5వేలకు పెంచారు. ఆమె లక్ష్యం ముందు సమస్యలన్నీ చిన్నబోయాయి.గెలుచుకున్న డబ్బుతో భర్తను కాపాడుకుంది. అంతే… మహారాష్ట్రలోని పత్రికలు, ఛానళ్లు ఆమె గొప్పతనాన్ని కీర్తించాయి. నెల తిరగకుండానే ఎంతో మంది సహాయం అందించగా ఆమె బ్యాంకు ఖాతాలో రూ.2లక్షల వరకు జమ అయ్యాయి. అప్పటినుంచి వరుసగా మూడేళ్ల పాటు మారథాన్విజేతగా లతా కరేనే గెలవడం గమనార్హం.

లతకరే స్ఫూర్తిపై సినిమా

  • కరీంనగర్కు చెందిన నవీన్కుమార్, యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం నెమురగొముల గ్రామానికి చెందిన ఎర్రబోతు కృష్ణ మారథాన్విజేత లతా కరే జీవిత కథ ఆధారంగా ఆమె పేరుతోనే మరాఠీలో చిత్రం ‘లతా భగవాన్కరే’ను రూపొందించారు. ఈ చిత్రం మహారాష్ట్రలో సక్సెస్ ఫుల్గా నడిచింది. తెలుగులోకి అనువదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.