Breaking News

‘ఎంఫాన్​’‌.. దూసుకొచ్చేన్​

‘ఎంఫాన్​’‌.. దూసుకొచ్చేన్​
  • బంగాళాఖాతంలో సూపర్‌ సైక్లోన్‌ గా తుఫాన్​
  • ఒడిశా, బెంగాల్‌ ప్రభుత్వాలు అలర్ట్​
  • సాయంత్రం ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష 

దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎంఫాన్ అతి తీవ్ర తుఫాన్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కి.మీలు, బెంగాల్‌లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుఫాన్​ సోమవారం సాయంత్రానికి సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుఫాన్​ తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటలకు హోంమంత్రిత్వశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో సమావేశం కానున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ తుఫాన్​ ప్రభావంపై సమీక్షించనున్నారు. ఈ సాయంత్రానికి ఎంఫాన్ తీవ్రరూపం దాల్చి సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. 
బలమైన గాలులు
ఉత్తర ఈశాన్య ప్రాంతం దిశగా 8కి.మీల వేగంతో కదులుతోన్న ఎంఫాన్ మరింత బలపడి ఈ సాయంత్రానికి పెను తుఫాన్​ గా మారుతుందని వాతావరణ శాఖ అంచనావేసింది. ఈనెల 20న సాయంత్రం తుఫాను తీరం దాటే సూచన ఉన్నట్టు తెలిపింది. బెంగాల్‌ – బంగ్లాదేశ్‌ మధ్య హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 185.కి.మీ వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ తుఫాన్​ ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌, సిక్కింలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. అలాగే, ఉత్తర కోస్తాంధ్రలోనూ మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 
ఒడిశా సర్కార్‌ అలర్ట్​
ఏడాది క్రితం ఫణి తుఫాన్​ తర్వాత ముంచుకొచ్చిన ఈ తుఫాన్​ తో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు 10లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. 12 తీర ప్రాంత జిల్లాల్లో పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నట్టు వెల్లడించారు. తుఫాన్​ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. అలాగే, తాగునీరు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణపై దృష్టిపెట్టాలన్నారు.
రంగంలోకి 17 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
మరోవైపు, తుఫాన్​ తీవ్రత నేపథ్యంలో 17 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. తుఫాన్​ ప్రభావం అధికంగా ఉండే ఒడిశా, బెంగాల్‌లో పనిచేస్తున్నాయి. బెంగాల్‌లోని ఏడు జిల్లాల్లో ఏడు బృందాలు, అలాగే, ఒడిశాలో 10 బృందాలను మోహరించి ఉన్నాయి. ఒక్కో బృందంలో 45మంది సిబ్బంది ఉంటారు. 
ఈశాన్య ఒడిశా ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర అన్నారు. తమిళనాడు, కర్ణాటకలోని పలుప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 
కరోనా నేపథ్యంలో..
ఎంఫాన్​ తుఫాన్​ ప్రభావిత ప్రాంతాల్లో నెలకొనే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బెంగాల్‌ హోంశాఖ కార్యదర్శి అలాపన్‌ బందోపాధ్యాయ్‌ అన్నారు. విపత్తు నిర్వహణ బృందాలను తీరప్రాంతాలకు పంపినట్టు చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.