- కరోనా వైద్యంపై ఆరా
సారథి న్యూస్, హైదరాబాద్: జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్రబృందం శనివారం ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా డీన్ డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ పాల్, ఇతర వైద్యాధికారులతో కలిసి ఈఎస్ఐ ఆస్పత్రిలోని వసతులను పరిశీలించారు.
కోవిడ్-19 పాజిటివ్ కేసులకు వైద్యసేవల ఏర్పాట్ల గురించి వాకబుచేశారు. అనంతరం చర్లపల్లిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ ను పరిశీలించి బియ్యం నిల్వల గురించి తెలుసుకున్నారు. బృందంలో కేంద్ర ప్రజారోగ్య సీనియర్ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ గెడం, జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ ఠాకూర్, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది తదితరులు ఉన్నారు.