![ఇది.. ఓ బిల్లేనా?](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/cm-kcr-2-4.jpg?fit=677%2C417&ssl=1)
- కేంద్రం వ్యవసాయ బిల్లుతో రైతు లోకానికి తీవ్ర అన్యాయం
- రైతులను కొట్టి కార్పొరేట్లకు పంచేలా ఉంది
- పార్లమెంట్లో గట్టిగా నిలదీయాలని సూచించిన సీఎం కేసీఆర్
సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం కలిగించేలా ఉందని, ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ గట్టిగా వ్యతిరేకించాలని సూచించారు.
తేనె పూసిన కత్తిలాంటి
‘పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేట్వ్యాపారులకు దారులు బార్లా చేయడానికి ఉపయోగపడే బిల్లు. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని కచ్చితంగా వ్యతిరేకించాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.
రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలి
‘ ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50శాతం సుంకం అమలులో ఉంది. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 70-75 లక్షల టన్నులను కొనుగోలు చేసింది.35 శాతం సుంకం తగ్గియడం ఎవరి ప్రయోజనం ఆశించి చేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండే సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్రనష్టం తీసుకొచ్చేలా, రైతుల ప్రయోజనాలను దెబ్బలా ఉందన్నారు. రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలని సూచించారు. ఈ బిల్లుకు వ్యతిరేకగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు.