Breaking News

ఆకలి.. పోరాటం

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: కరోనా విజృంభిస్తున్న వేళ కూలీలు, మేస్త్రీలు, రైతులు, కార్మికులు, హమాలీలు, డ్రైవర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే రెక్కాడితే గానీ డొక్కాడని బక్కజీవులకు పనులు దొరకడం లేదు. చాలా మంది తమ పనులకు తాత్కాలిక విరామం ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే సాధారణ రోజువారీ కూలీలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెత్తిన పెద్ద బండరాయిని మోస్తూ.. మండు టెండలో బక్కచిక్కిన దేహంతో నడుస్తూ వెళ్తున్న ఓ పెద్దమనిషి సోమవారం కంటపడ్డాడు. అతని వివరాలు ఆరా తీయగా.. ‘ నా పేరు గోవిందు. మాది షాషాబ్​గుట్ట. రోజూ కూలీ పనులు చేస్తేనే పూట గడిచేది. కరోనా వచ్చి నాలాంటి వారికి పనిలేకుండా చేసింది. ఎవరో చనిపోయారని తెలిసి బండలు మోసే పని దొరికింది. రూ.300 వచ్చింది.’ అని తన ఆకలి బాధ వివరించాడు ఆ పెద్దమనిషి.. కష్టకాలంలో ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.

–కాటం జగదీశ్​