Breaking News

లాక్​ డౌన్​.. అసంఘటిత రంగంపై దాడి

లాక్​ డౌన్​.. అసంఘటిత రంగంపై దాడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​.. అసంఘటిత రంగం మీద మోడీ సర్కారు చేసిన మూడో దాడి అని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కొద్దిరోజులుగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. ఈ వీడియో సిరీస్ లో భాగంగా బుధవారం రాహుల్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ పై పోరులో భాగంగా 21 రోజులు యుద్ధం చేసి గెలుద్దామని మాయమాటలు చెప్పి అమాయకపు ప్రజల జీవనోపాధిని మోడీ దెబ్బతీశారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత అసంఘటితరంగం పై లాక్​ డౌన్​ను మూడవ దాడిగా అభివర్ణించారు. ‘చిన్న పరిశ్రమలు, నిర్మాణరంగంలో పనిచేసే దినసరి కూలీలకు లాక్​డౌన్​ శాపంగా మారింది. ముందస్తు నోటీసులు లేకుండా మోడీ సర్కారు విధించిన 21 రోజుల లాక్​డౌన్​.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న అసంఘటిత రంగాన్ని 21 రోజుల్లో నాశనం చేసింది. అంతేగాక భవిష్యత్ భారతాన్ని అగాథం లోకి నెట్టింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న, మధ్యతరహా వ్యాపారులకు నగదు బదిలీ చేయాలని తాము ఎన్నోసార్లు సూచించినా కేంద్రం మాత్రం తమ మాటలు పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.