- వాయుసేనలోకి ఐదు విమానాలు
- మరింత పెరిగిన భారత ఎయిర్ఫోర్స్ బలం
అంబాలా: కొద్దిరోజుల క్రితమే ఫ్రాన్స్ నుంచి భారత్కు వచ్చిన రాఫెల్ ఫైటర్ జెట్లు ఫీల్డులోకి దిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో గురువారం ఆ ఐదు విమానాలు భారత వాయుసేనలో చేరాయి. దీంతో మన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలకు తోడు రాఫెల్ కూడా జతకలవడంతో భారత ఎయిర్ఫోర్స్ బలం మరింత పెరిగింది. తాజాగా ఎల్ఎసీ వద్ద చైనా వరుసగా దుస్సాహసాలకు పాల్పడుతుండడంతో ఆ దేశానికి చెందిన వైమానిక విమానాలను కూడా సరిహద్దుల్లో మోహరించారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వీటిని ముందు జాగ్రత్తచర్యగా వైమానిక దళానికి అందజేశారు. గురువారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లె నేతృత్వంలో మొదటి బ్యాచ్కు చెందిన రాఫెల్ విమానాలను వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. అంబాలా ఏర్స్పేస్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా నిర్వహించిన వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, వాయుసేనాధిపతి బదౌరియా, తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ రాఫెల్ జెట్లను భారత వాయుసేనలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు చేసే 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఆర్స్లోకి అందించనున్నారు.