మాజీ బ్యాట్స్ మెన్ మహ్మద్ కైఫ్
న్యూఢిల్లీ: టీమిండియాలోకి ఎంతమంది వికెట్ కీపర్లు వచ్చినా.. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ బ్యాట్స్ మెన్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఫిట్ నెస్, కీపింగ్ విషయంలో అతన్ని తలపించేవారు లేరన్నాడు. అందుకే ఇప్పటికీ మహీయే నంబర్వన్ కీపర్ అని చెప్పాడు. ‘ఐపీఎల్తో పునరాగమనం చేద్దామని ధోనీ భావించాడు. కానీ అది వాయిదా పడింది. కానీ నా దృష్టిలో అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ధోనీ చాలా పెద్ద ఆటగాడు. తిరుగులేని మ్యాచ్ విన్నర్. ఆరు, ఏడు స్థానాల్లో ఉండే ఒత్తిడిని అధిగమించి మ్యాచ్లను గెలిపించడమంటే మామూలు విషయం కాదు. ధోనీ చాలా అలవోకగా ఆడేస్తాడు. ఇప్పటికైనా అతన్ని మించిన ప్లేయర్ ఎవరూ లేరు. రాహుల్ ను బ్యాకప్ కీపర్గానే చూసుకోవాలి. పూర్తి బాధ్యతలు పెడితే ఇబ్బందులు వస్తాయి’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు. కొంత మంది క్రికెటర్లకు ప్రత్యామ్నాయాలు దొరికినా.. ధోనీకి దొరకడం కష్టమన్నాడు. రిషబ్ పంత్, సంజూ శాంసన్లో మహీని అందుకునే సత్తా, సామర్థ్యం లేవని స్పష్టం చేశాడు. అందుకే తొందరపడి ధోనీని టీమ్ కు దూరం చేయకూడదని చెప్పుకొచ్చాడు.