- ఆస్ట్రేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్
మెల్ బోర్న్: కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ర్టేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే.. ఐపీఎల్ కు మార్గం సుగమమైనట్లేనని ఆస్ర్టేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ఆ సమయంలో అన్ని దేశాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి లీగ్ను నిర్వహించేందుకు ఈజీగా ఉంటుందన్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ జరగకపోవచ్చు. కానీ షెడ్యూల్ టైమ్ వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఇప్పుడే చెప్పలేం.
అయితే 15 జట్లను ఆసీస్ కు తీసుకొచ్చి, ఏడు వేదికల్లో మ్యాచ్లు నిర్వహించడం, క్వారంటైన్ లో ఉంచడం చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి ఈ లెక్కన మెగా ఈవెంట్ దాదాపుగా అసాధ్యమేనని అనిపిస్తోంది’ అని టేలర్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో ఆడాలనుకునే క్రికెటర్లు వ్యక్తిగతంగా అన్ని బాధ్యతలు తీసుకోవాలన్నాడు. వీళ్ల ప్రయాణ బాధ్యతలను జాతీయ బోర్డులు తీసుకోవద్దని చెప్పాడు. జట్టు మొత్తం కాకుండా ప్లేయర్లు ఒక్కొక్కరుగా వెళ్లడం మంచిదని టేలర్ చెప్పుకొచ్చాడు.