Breaking News

నరేంద్రమోడీని తిట్టడమే కేసీఆర్ పని

నరేంద్రమోడీని తిట్టడమే కేసీఆర్ పని
  • ఆర్వోబీలకు కేంద్ర నిధులు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

సామాజికసారథి, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్టంలో అన్ని ఆర్వోబీలకు కేంద్రం నిధులు వందశాతం ఇస్తే సీఎం కేసీఆర్ మాత్రం అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అనేక సంక్షేమ పథకాల్లో తమ ఫొటోలు పెట్టుకొని ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. సోమవారం మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ జాతీయ రహదారి అప్పన్నపల్లిలో జరుగుతున్న ఆర్వోబీ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆర్వోబీ పనులకు కేంద్రం ప్రభుత్వం రూ.249 కోట్ల నిధులు ఇచ్చిందని అన్నారు. రాష్టంలో భూసేకరణ, రోడ్ల కోసం అన్ని నిధులు కేంద్రానివేనని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి సహకరించకుండా అడ్డుపడి ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నదని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇవేమీ కేసీఆర్ కు పట్టడం లేదని విమర్శించారు. అప్పన్నపల్లి ఆర్వోబీ బ్రిడ్జిని కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీజేపీ శ్రేణులు బండి సంజయ్ కు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, మాజీఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.