Breaking News

రూ.50వేలకు కక్కుర్తి

– లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ
– వీసీ ఇంట్లో 8 గంటల పాటు సోదాలు
– పలు కీలకపత్రాలు స్వాధీనం.. అనంతరం అరెస్ట్‌

సామాజికసారథి, హైదరాబాద్‌: నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తాను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్​ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్‌ గుప్తాను అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని భీమ్‌గల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు వీసీ రవీందర్‌ గుప్తా రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. వీసీ రవీందర్‌ గుప్తా నివాసంలో ఏసీబీ అధికారులు సుమారు 8 గంటలపాటు సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీసీ బ్యాంక్‌ అకౌంట్లు ఇతర పత్రాలను తనిఖీచేశారు. గత వారమే ఆయనపైన ఆరోపణలు రావడంతో ఏసీబీ టీమ్‌ నేరుగా యూనివర్శిటీకి వెళ్లి ఆయన ఛాంబర్‌లో సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో ఏ వివరాలు దొరికాయన్నది గోప్యంగానే ఉంచారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హైదరాబాద్‌ నివాసంలో వీసీ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. నియామకాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందనేది ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి.

గందరగోళం నేపథ్యంలో..
కాగా, గతకొన్ని రోజులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వర్సిటీ రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో పాలకమండలితో వీసీకి బేధాభిప్రాయాలు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే వర్సిటీలో పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో వీసీ వెనక్కి తగ్గారు. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. అయితే తాజాగా వీసీ రవీందర్‌ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడటం గమనార్హం. వీసీ ఏసీబీ అధికారులకు పట్టుబడిన తర్వాత విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీలో సంబురాలు జరుపుకున్నారు.