- ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై అసభ్యకర పోస్ట్
- దేహశుద్ధి చేసిన పాలెం గ్రామస్తులు
- కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించిన పోలీసులు
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్మీ మాజీ జవాన్ ను స్థానికులు చెప్పులతో చితకబాదారు. పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు అతడి ఇంటి ముందు ఆ గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. స్థానికుల కథనం.. పాలెం గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ జవాన్ దుగ్యాల వెంకటయ్య.. ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ పెట్టాడు. అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో గ్రామ మహిళలు, యువకులు పెద్దఎత్తున సదరు వ్యక్తి ఇంటిని ముట్టడించారు. చెప్పులు, చీపురుకర్రలతో చితకబాదారు. దీనికి ప్రతిగా సదరు మాజీ ఆర్మీ జవాన్ దుగ్యాల వెంకటయ్య భార్య పేరు పెట్టి ఎంపీపీ వర్గీయులు కూడా అదే పోస్ట్ ను వైరల్ చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో సదరు ఆర్మీ మాజీ జవాన్ ను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్సై నరేందర్ రెడ్డి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. మరోసారి రిపీట్ కావొద్దని సూచించారు. సదరు మాజీ ప్రజాప్రతినిధికి మాజీ జవాన్ దుగ్యాల వెంకటయ్య చేత సారీ చెప్పించారు.