- ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైనా ఎమ్మెల్సీల ప్రమాణం
- బండా ప్రకాశ్ మినహా ఐదుగురితో ప్రమాణ స్వీకారం
- ప్రమాణం చేయించిన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి
- ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి
సామాజిక సారథి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. బండా ప్రకాష్ మినహా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి చేత మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. అయితే బండాప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణం చేయనున్నారు. శాసనసభ్యుల కోటాలో ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల ఎన్నికను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన వారిలో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్రెడ్డి, పరుపాటి వెంకట్రాంరెడ్డి, బండా ప్రకాశ్ ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ మండలికి ఎన్నికైన నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన 14 రోజుల్లో రాజ్యసభకు రాజీనామా చేయాలనే నిబంధన మేరకు గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బండా ప్రకాశ్ చెప్పారు.
10న 6 స్థానాలకు పోలింగ్
అలాగే గవర్నర్ కోటాలో ఎన్నికైన మధుసూదనాచారితో పాటు బండా ప్రకాశ్ ఈనెల 6 తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటాలో వచ్చే ఏడాది జనవరి 4న 12 మంది సభ్యుల పదవీ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 12 స్థానాలనుగాను ఇప్పటికే ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరో ఆరుస్థానాలకు ఈనెల 10న పోలింగ్ జరగనుంది. జనవరి 4 తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యే 12 మంది కూడా పదవీ ప్రమాణం చేస్తారు. ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బొకే అందజేసి శుభాకాంక్షలు అందజేశారు. మంత్రి వెంట నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, మాజీఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు ఉన్నారు.