సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు
లండన్: వన్డే ఫార్మాట్ లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్. ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా 2010 గ్వాలియర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మాస్టర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. అయితే తాను 190 పరుగుల వద్ద సచిన్ ను ఎల్బీ చేసినా అంపైర్ ఔట్ ఇవ్వలేదని సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అప్పుడు ఔటిస్తే ద్విశతకం కాకపోయేదని అక్కసు వెళ్లబోసుకున్నాడు. ‘వన్డేల్లో సచిన్ దే తొలి ద్విశతకం. అది మాపైనే చేశాడు. ఆ మ్యాచ్ లో నేను మాస్టర్ ను ఎల్బీ చేశా. కానీ ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ నాటౌట్ ఇచ్చాడు. బంతి వికెట్లను తాకుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.నాటౌట్ ఎందుకు ఇచ్చావని అంపైర్ను అడిగా. కానీ సరైన సమాధానం చెప్పలేదు. నాకు తెలిసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను చూసి భయపడినట్లు ఉన్నాడు. అతని ముఖంలో అది కనిపించింది. ఒకవేళ ఔటిస్తే ప్రేక్షకులు అతన్ని హోటల్ కు వెళ్లకుండా అడ్డుపడతారని భావించాడనుకుంటా. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ నాకు బాగా గుర్తున్నాయి’ అని స్టెయిన్ వ్యాఖ్యానించాడు.
వాస్తవానికి ఆ మ్యాచ్ లో సచిన్ 190 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. స్టెయిన్ వేసిన ఓవర్ లో కేవలం మూడు బంతులే ఆడాడు. అందులో ఎక్కడా ఎల్ బీకి అవకాశం లభించలేదు. ఓవరాల్గా ఆ మ్యాచ్లో సచిన్ వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ చేయడంతో ఇండియా 403/3 రన్స్ చేసింది. తర్వాత లక్ష్యఛేదనలో సఫారీ టీమ్ 42.5 ఓవర్లలో 248 రన్స్ కు ఆలౌటైంది. ఫలితంగా టీమిండియా 153 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే ఫార్మాట్లో సచిన్ ఆ ఘనత సాధించిన తర్వాత.. రోహిత్, సెహ్వాగ్, గేల్, గప్టిల్ కూడా డబుల్ సెంచరీలు సాధించారు.