Breaking News

14 టన్నుల నైట్రేట్ పట్టివేత

సారథి న్యూస్, జనగామ: పేలుడు స్వభావం కలిగిన అమ్మోనియం నైట్రేట్ బస్తాలను జనగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సీఐ రాపెళ్లి సంతోష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నర్మెట్ట మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన పున్నెరెడ్డి కృష్ణారెడ్డికి చెందిన వెంకటసాయి గోదాం నుంచి పేలుడు పదార్థాలకు వినియోగించే ముడి సరుకును రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో అమ్మాపురం, వెల్దండ, పోతారం చౌరస్తాలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 50 కేజీలు ఉన్న 180 బస్తాల లోడు, మరొకటి వంద బస్తాల లోడుతో వెళ్తున్న రెండు టాటా మినీలారీల్లో 14 టన్నుల అమ్మోనియం నైట్రేట్​ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.ఏడు లక్షల మేర ఉంటుందని అధికారులు ధ్రువీకరించారు. కారు, రెండు డీసీఎంలను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేశామని తెలిపారు.