![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/HUBLI-2.jpg?fit=294%2C171&ssl=1)
హుబ్లీ: కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచ రికార్డ్ సృష్టించనుంది. ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ఫ్లాట్ఫాంను నిర్మిస్తుంది. దాని పొడవు 1400 మీటర్లు కాగా.. వెడల్పు 10 మీటర్లు అని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 550 మీటర్ల ఫ్లాట్ఫాంను 1400 మీటర్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. రూ.90 కోట్ల వ్యయంతో చేపట్టిన రీమోడలింగ్ పనుల్లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నట్లు సౌత్ వెస్ట్ రైల్వే ప్రకటించింది. వచ్చే ఏడాది కల్లా పనులు పూర్తవుతాయని చెప్పింది. దీంతో పాటు మరో రెండు ఫ్లాట్ఫాంలు కడుతున్నామని, దీంతో స్టేషన్లో మొత్తం 8 ఫ్లాట్ఫాంలు అవుతాయని చెప్పారు. ఈ నిర్మాణం పూర్తయితే ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ స్టేషన్లో ఉన్న లాంగెస్ట్ రైల్వే ఫ్లాట్ఫాం రికార్డును దాటుతుందని పేర్కొన్నారు. గోరఖ్పూర్లో ప్రస్తుతం 1366 మీటర్ల పొడవైన ఫ్లాట్ఫాం ఉంది. ఆ తర్వాత కేరళలోని కొల్లమ్ జంక్షన్లో 1180 మీటర్ల ఫ్లాట్ఫాం ఉంది.