Breaking News

వీధి వ్యాపారులను ఆదుకుందాం

వీధి వ్యాపారులను ఆదుకుందాం

సారథి న్యూస్, కర్నూలు: వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాని ఆత్మనిర్భర్​నిధి పథకాన్ని అర్హులైన వారికి అందించాలని నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ మెప్మా సిబ్బందిని ఆదేశించారు. బుధవారం స్థానిక నగర పాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన మెప్మా పీడీ తిరుమలేశ్వర్ రెడ్డి తో కలిసి సీవోలతో సమావేశమయ్యారు. వీధి వ్యాపారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే ప్రక్రియ, సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం రూపొందిన ప్రత్యేక యాప్ లో ఎంత వరకు పొందుపరిచారని ఆరాతీశారు.

ప్రతి వీధి వ్యాపారికి ధ్రువీకరణ పత్రంతో పాటు గుర్తింపు కార్డు అందజేయాలన్నారు. రిజిస్ట్రేషన్ అయిన దరఖాస్తులను వెంటనే ఆన్ లైన్ లో పొందుపరచాలని సూచించారు. గుర్తించిన 1800 మంది వీధి వ్యాపారుల్లో ప్రస్తుతం సమాచారం ఉన్న 1,387 మంది చిరు వ్యాపారుల వివరాలతో డాక్యుమెంటేషన్ పూర్తిచేయాలని సూచించారు. మిగతా 413 మంది వివరాలు సేకరించి పథకం ఫలాలు వర్తింపజేయాలన్నారు. సమావేశంలో మెప్మా పీవో రాధికారెడ్డి పాల్గొన్నారు.