![రూ.5లక్షలు మట్టిపాలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/nkd-3.jpg?fit=677%2C383&ssl=1)
సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వాగులు, వంకలు మత్తడి దూకుతున్నాయి. చాలా గ్రామాల్లో పత్తి, మినుము, సోయా, కంది పంటలు నీటిమునిగిపోయాయి. పంట పొలాల్లో నిలిచిన నీటిని మళ్లించేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామానికి చెందిన కొందరు రైతులు వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు చందాలు వేసుకుని రూ.ఐదులక్షల వ్యయంతో ఫార్మేషన్ రోడ్డు నిర్మించుకున్నారు. సోమవారం కురిసిన జోరు వానకు బ్రిడ్జితో పాటు వాగులో వేసిన పైపులు కొట్టుకుపోయాయి. కష్టపడి వేసుకున్న రోడ్డు నీటి పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేలకు పోవాలంటే వాగు దాటిపోవాల్సి వస్తోంది. వరదకు కొట్టుకుపోయిన బ్రిడ్జిని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చొరవ తీసుకుని రోడ్డు పున:నిర్మించాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఏడీఏ కరుణాకర్ రెడ్డి తెలిపారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/nkd-2f.jpg?resize=640%2C360&ssl=1)