Breaking News

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు

జైపూర్‌‌, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్‌ నిర్వహించేందుకు గవర్నర్‌‌ పర్మిషన్‌ ఇచ్చిన నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జైపూర్‌‌ రిసార్ట్‌ నుంచి జైసల్మీర్‌‌లోని హోటల్‌కు తరలిస్తున్నారని సమాచారం. ఆగస్టు 14న బలపరీక్ష నిర్వహించేందుకు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ వర్గం సిద్ధం అవుతోంది.

తనకు సపోర్ట్‌గా ఉన్న 100 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌‌లోని రిసార్ట్‌ నుంచి జైసల్మీర్‌‌లోని రిసార్ట్‌కు తరలిస్తున్నారు. బీజేపీ తమ పార్టీలోని ఎమ్మెల్యేలను కొనాలని చూస్తోందని, గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు ఆశ చూపుతోందని అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. సచిన్‌ పైలెట్ వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారని, అందుకే ఆగస్టు 14 వరకు తమ వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అశోక్‌గెహ్లాట్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రకటించిన రోజు రాత్రి నుంచే బేరసారాలు మళ్లీ షురూ అయ్యాయని, గతంలో ఇస్తామని ఒప్పుదాని కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆశ చూపుతున్నారని అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు.