Breaking News

ప్యాడ్స్ అడుక్కున్నా.. సెంచరీ కొట్టా

న్యూఢిల్లీ: కరోనా లాక్​ డౌన్​తో ఇంటికే పరిమితమైన బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. ఓ రంజీ మ్యాచ్​లో అజిత్ వాడేకర్ ప్యాడ్స్ కట్టుకుని బరిలోకి దిగాల్సి వచ్చిందన్నాడు. అయితే ఆ మ్యాచ్​లో శతకం కొట్టడంతో తన కెరీర్ ఊపందుకుందని చెప్పాడు. ‘శ్రీలంకలో ఇంటర్‌ యూనివర్సిటీ క్రికెట్‌ టోర్నీలో ట్రిపుల్‌ సెంచరీ చేయడంతో నాకు భారత్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. కానీ ముంబై రంజీ టీమ్‌లో చోటు కోల్పోయాను. ఎందుకంటే లంకలో ఉండడంతో ఓ రంజీ మ్యాచ్​ను ఆడలేకపోయాను. ఆ మ్యాచ్‌లో వేరే ప్లేయర్ బాగా ఆడాడు. దీంతో నన్ను 12వ ఆటగాడిగా ఎంపిక చేశారు.

మ్యాచ్​కు ముందు ఫీల్డింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా మా కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ గాయపడ్డాడు. టాస్‌కు ముందే ఇది జరగడంతో తుదిజట్టులో నాకు చోటు దొరికింది. అయితే ఇప్పుడున్నట్లు.. అప్పట్లో మాకు పెద్ద కిట్స్ ఉండేవి కావు. నేను ఓ చిన్న బ్యాగ్‌లో షూస్‌, సాక్స్​లు మాత్రమే తెచ్చుకున్నా. ప్యాడ్స్‌, గ్లోవ్స్‌ తీసుకురావడం మరిచిపోయా. బ్యాటింగ్, బౌలింగ్ విషయం తేలకపోవడంతో వెంటనే మా అమ్మకు ఫోన్‌ చేసి ప్యాడ్స్‌ తీసుకురమ్మని చెప్పా. కానీ ఈ లోపే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. మరోదారి లేక వాడేకర్‌ను అడిగి అతని ప్యాడ్స్‌ కట్టుకుని బ్యాటింగ్‌ చేశా. వాడేకర్‌ ఎడమ చేతి వాటం. నేను కుడిచేతి వాటం. దీంతో ప్యాడ్స్‌ వల్ల కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ ఆ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’ అని సన్నీ చెప్పుకొచ్చాడు.