Breaking News

దుబ్బాక బీజేపీదే

దుబ్బాక బీజేపీదే

  • గులాబీ కోటలో కాషాయ జెండా రెపరెపలు
  • ఉత్కంఠ పోరులో రఘునందన్‌ రావు విజయం
  • కారును పోలిన సింబ‌ల్‌ను 3,489 ఓట్లు

సారథి న్యూస్, దుబ్బాక: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్యరీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం చూపి టీఆర్‌ఎస్‌ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరవేసింది. టీ-20 మ్యాచ్‌లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం చూపగా అనుహ్యంగా పుంజుకున్న టీఆర్‌ఎస్‌ 11 నుంచి 20 రౌండ్‌ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాల్​ విసిరింది. అయితే పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చి.. ఉత్కంఠకు తెరదించింది. వరుసగా 20, 21, 22, 23 రౌండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి సంచలన విజయాన్ని నమోదుచేసింది. దుబ్బాక విజయంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విజయం అనంతరం సర్టిఫికెట్​ చూపుతున్న రఘునందన్​రావు
ఎన్నికల అధికారుల నుంచి సర్టిఫికెట్​ అందుకుంటున్న రఘునందన్​రావు