Breaking News

టీమిండియా క్రికెటర్లకు ట్రైనింగ్​

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల ట్రైనింగ్​పై బీసీసీఐ దృష్టిపెట్టింది. ధర్మశాల లేదా బెంగళూరులోని ఎన్సీఏలో జాతీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే నాలుగు దశల ట్రైనింగ్​ షెడ్యూల్​ను రూపొందించినట్లు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించాడు. దీంతో నాలుగు నుంచి ఆరు వారాల్లో క్రికెటర్లు పూర్తి ఫిట్​నెస్​ సాధిస్తారని చెప్పాడు. ‘చాలా విరామం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వస్తారు. కాబట్టి చాలాఉత్సాహంగా ఉంటారు. అలాంటి సమయంలోనే మనం వాళ్లను సరైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలి. లేదంటే గాయాలపాలవుతారు. ఆరంభంలో ప్లేయర్లకు చాలా తక్కువ స్థాయి పనిభారం ఉండేలా కసరత్తులు చేయిస్తాం. ఆపై కొద్దిగా పెంచుతాం. చివరి రెండు వారాల్లో తీవ్రత ఎక్కువ ఉండేలా ఎక్సర్​సైజ్​లు ఉంటాయి’ అని శ్రీధర్ పేర్కొన్నాడు.
వేర్వేరు ప్రాక్టీస్
తొలి దశలో పేసర్లు సగం లేదా క్వార్టర్ రన్​తో రెండు ఓవర్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ఫీల్డర్లు 10, 20 మీటర్ల దూరం త్రో చేస్తారు. బ్యాట్స్​మెన్​ పేస్ బౌలింగ్​లో ఐదారు నిమిషాలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. సెమీ సాఫ్ట్ బాల్ క్యాచ్ ప్రాక్టీసింగ్ ఉంటుంది. నాలుగో వారం నుంచి ఈ ప్రాక్టీస్​లో తీవ్రత పెంచుతారు. క్రమంగా మ్యాచ్ ఫిట్​నెస్​ ను సాధిస్తారు. అప్పుడు వేగంగా వచ్చే బంతులను అలవోకగా ఎదుర్కొంటారు. బౌలర్లు పూర్తి స్పీడ్​లోకి వస్తారు. అయితే ఫిజికల్‌, మెంటల్‌ ఫిట్‌నెస్‌ను బట్టి ఈ సమయం ఒక్కో ప్లేయర్‌కు ఒక్కోరకంగా ఉంటుంది. కొంతమందికి నాలుగు వారాలు పడితే, ఇంకొందరికి మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టొచ్చు. బీసీసీఐ కాంట్రాక్టు క్రికెటర్లంతా టీమ్‌ స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ నిక్‌ వెబ్‌ రూపొందించిన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను ఫాలో అవుతున్నారు.