Breaking News

జట్టుకే డబ్బులు ఇవ్వాలి: గోపీచంద్

జట్టుకే డబ్బులు ఇవ్వాలి: గోపీచంద్

న్యూఢిల్లీ: ఒక్కో అథ్లెట్ను దృష్టిలో పెట్టుకోకుండా టీమ్ మొత్తాన్ని డెవలప్ చేసేలా ప్లానింగ్ ఉంటే క్రీడాభివృద్ధి సాధ్యమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం ఉన్న అథ్లెట్ సెంట్రిక్ విధానాన్ని వీడితే ఎక్కువ మంది చాంపియన్లను తయారుచేయగలమని సూచించాడు. కొత్త అసోసియేట్ డైరెక్టర్ల నియామకం సందర్భంగా సాయ్ మంగళవారం నిర్వహించిన ఆన్ లైన్ సెషన్లో గోపీచంద్ పలు సూచనలు చేశాడు.

‘ ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలన్నీ అథ్లెట్ కేంద్రంగానే ఉన్నాయి.వాటి వల్ల అథ్లెట్ కు లబ్ధి చేకూరుతుంది కానీ స్పోర్ట్స్ ఎలాంటి ఉపయోగం లేదు. అందువల్ల ఓ గ్రూప్ మీద దృష్టిపెట్టాలి. ఓ స్పోర్ట్స్ డెవలప్ చేయాలంటే టీమ్ పరంగా నిధులు కేటాయించాలి. అప్పుడే చాంపియన్లు వెలుగులోకి వస్తారు. మన విధానాలు మారాలి. కాంపిటిషన్ కూడా చాలా హై లెవెల్ ఉండాలి. దాని వల్ల ఓ అథ్లెట్ కే తెలియకుండా వరల్డ్ క్లాస్ స్థాయికి చేరుతాడు. నంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తికి రెండు, మూడు ప్లేస్‌ లో ఉన్న అథ్లెట్ల నుంచి నిత్యం పోటీ ఉంటుంది’ అని గోపీచంద్ అన్నాడు.

అంతేకాక అథ్లెట్లతో కోసం ప్రత్యక్షంగా శ్రమించే కోచ్ లకు తగిన గుర్తింపుతోపాటు ప్రోత్సాహం ఉండాలని సూచించాడు. లేదంటే కోచ్ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని గోపీచంద్ చెప్పాడు.