- ఏసీబీ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు
- మెదక్ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం
- నర్సాపూర్ ఆర్డీవో ఇంట్లో అర కిలో బంగారు ఆభరణాలు
సారథి న్యూస్, మెదక్: రూ.లక్షల్లో జీతం.. ఖరీదైన కారు.. సౌకర్యవంతమైన జీవనం.. ఇవి చాలవనుకోవచ్చు కాబోలు!. అత్యాశే అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని అవినీతిలోకి తోసింది. ఓ భూమికి సంబంధించి ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ.1.12 కోట్లు లంచంగా డిమాండ్ చేసిన మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అవినీతి గుట్టురట్టయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బుధవారం ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు నగేష్తోపాటు అవినీతి బాగోతంతో సంబంధం ఉన్న నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, భూ సర్వే కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ వసీం, అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ జీవన్ గౌడ్పై కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం వివరాలను వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి మరో నలుగురు వ్యక్తులు కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలో సర్వే నం.59/31, 59/40, 58/1, 58/2లో ఉన్న 112.21 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కాగా, ఆ భూమి 22ఏ ప్రకారం ప్రభుత్వ భూమి కావడంతో రిజిస్ట్రేషన్ చేయడానికి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) అవసరం. దీంతో లింగమూర్తి నిరభ్యంతర పత్రం కోసం జులై 22న నర్సాపూర్ తహసీల్దార్ సత్తార్కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన సదరు దరఖాస్తు ప్రతిని జులై 23న మెదక్కలెక్టర్ ధర్మారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డికి పంపించారు. ఈ క్రమంలో జులై 25న ఆర్డీవో సదరు దస్త్రాన్ని కలెక్టరేట్కు పంపించారు. ఈ క్రమంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సదరు భూమికి నిరభ్యంతర పత్రం జారీ చేసేందుకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఒప్పుకున్న లింగమూర్తి జులై 31న మొదటి విడతగా రూ.19.5 లక్షలు, రెండో విడతగా ఆగస్టు 7న మరో రూ.20.5 లక్షలు కలిపి మొత్తం రూ.40 లక్షలు నగేష్కు ఇచ్చాడు. ఇవిపోనూ ఒప్పందంలో భాగంగా ఇవ్వాల్సిన మిగతా రూ.72 లక్షలు లింగమూర్తి చెప్పిన సమయంలోగా అందజేయలేకపోయారు. కాగా, అదనపు కలెక్టర్ నగేష్రూ.72 లక్షలకు బదులుగా ఐదెకరాల భూమిని తన బినామీ అయిన కోల జీవన్గౌడ్కు విక్రయించేలా లింగమూర్తితో ఒప్పందపత్రం రాయించుకున్నారు. ఆ ఐదెకరాల భూమి రిజిస్ట్రేషన్చేసేందుకు జమానతుగా లింగమూర్తి నుంచి నగేష్ సంతకం చేసిన 8 ఖాళీ చెక్కులను తీసుకున్నారు.
బినామీతో దందా
ఇదిలాఉండగా, భూసర్వే కార్యాలయంలో జూనియర్అసిస్టెంట్గా పనిచేసే మహ్మద్వసీం లింగమూర్తి నుంచి రూ.ఐదులక్షలు తీసుకుని అందులో నుంచి నర్సాపూర్ఆర్డీవో అరుణారెడ్డికి రూ.ఒక లక్ష, తహసీల్దార్అబ్దుల్సత్తార్ కు రూ.లక్ష ఇచ్చి మిగిలిన రూ.మూడు లక్షలు తాను తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చి నిరభ్యంతర పత్రం తీసుకుని, భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ నగేష్బాధితుడు లింగమూర్తిపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో విసిగిపోయిన లింగమూర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లింగమూర్తి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ లు సూర్యనారాయణ, ఫయజ్, ఆరుగురు సీఐల ఆద్వర్యంలో మెదక్ మండలం మాచవరంలోని అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో సోదాలు జరపడంతో పాటు నర్సాపూర్లోని ఆర్డీవో ఆఫీసు, తహసీల్దార్ కార్యాలయం, సంగారెడ్డిలోని తహసీల్దార్ సత్తార్ఇంట్లో , హైదరాబాద్ లోని ఆయా అధికారుల ఇళ్లు, వారి బంధువుల ఇళ్లలో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆయా చోట్ల సోదాలు కొనసాగాయి.
సోదాల్లో నగేష్ ఇంట్లో చిప్పల్తుర్తి భూమికి సంబంధించి లింగమూర్తితో జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన ఇంట్లో నుంచి తన బినామీ అయిన జీవన్గౌడ్ పేరు మీద చేసుకున్న ఐదెకరాల భూమి విక్రయ ఒప్పంద పత్రం, 8 ఖాళీ చెక్ లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా, హైదరాబాద్లోని నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో సరైన అధారాలు లేని రూ.28లక్షల నగదుతో పాటు అర కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.