సారథి న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉట్టిగా, ఆషామాషీగా రాలేదని, వందలాది మంది అమరవీరుల ఆత్మార్పణంతో ఆవిర్భవించిందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యోపన్యాసం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు. గద్గదస్వరంతో ప్రసంగం కొనసాగించారు.
నాటి తెలంగాణ ఉద్యమ నిర్మాత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేతృత్వంలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేజీ నర్సింహులు, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.