Breaking News

ఆ‘ధర్మరాజు’ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకు!

ఆ‘ధర్మరాజు’ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకు!

  • దళితసంఘాలు ఎమ్మెల్యే మర్రికి వంతపాడటం సిగ్గుచేటు
  • బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల శివుడు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్​కర్నూల్ నియోజవర్గంలో దళిత రాష్ట్ర నాయకుడిగా చెప్పుకునే జెట్టి ధర్మరాజు.. అధర్మరాజుగా మారిపోయారని బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల శివుడు విమర్శించారు. ఉయ్యాలవాడలో రైతు కాశన్న మృతిచెందిన సంఘటనలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై బీజేపీ పోరాటం చేస్తే దళితుల పక్కన ఉండాల్సిన మీరు ఆయనకు సపోర్టు చేయడం సిగ్గుచేటని తీవ్రవిమర్శలు చేశారు. ఆదివారం నాగర్​కర్నూల్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులపై తీవ్రవిమర్శలు చేశారు. ఇక్కడి దళిత సంఘాల నాయకులు సంఘాల పేరుతో రాష్ట్ర, జిల్లా నాయకులమని చెప్పుకుని దళితుల ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో కుదువాబెట్టారని విమర్శించారు. అలాంటి వారు బీజేపీ నాయకులపై అక్రమకేసులు పెట్టి బెదిరిస్తే భయపడేది లేదని హెచ్చరించారు.

బెదిరించడం మానుకోండి
పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్ పేరుతో జరుగుతున్న చెరువుల కుంభకోణాల్లో దౌర్జన్యంగా దళిత గిరిజన రైతుల భూములను మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులతో బెదిరించి పలుమార్లు కేసులు పెడితే మీ దళిత సంఘాలు ఇక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర నాయకుడిగా చెప్పుకుంటున్న జెట్టి ధర్మరాజు ఏ ఒక్కరోజైనా ఉద్యోగం చేసే రోజుల్లో కనీసం దళిత విద్యార్థులకు అయినా పాఠాలు చెప్పి ఉంటే ఇక్కడి ప్రజల్లో కొంతైనా చైతన్యం వచ్చేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్రమాలను బీసీ వర్గానికి చెందిన దిలీప్ ఆచారి ప్రశ్నిస్తే దళితులను ముందుపెట్టి అధికారం ఉంది కదా? అని అక్రమకేసులు పెట్టి బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు. గ్రామాల్లో రెడ్డి రాజకీయాలు చేస్తున్న మర్రి జనార్దన్ రెడ్డికి రాష్ట్ర, జిల్లా దళిత నాయకులకు అంబేద్కర్ మళ్లీ వచ్చి హితబోధ చేస్తే తప్ప మీరు మారేలా లేరని అన్నారు. మీలాంటి నాయకులు సంఘాల పేరు చెప్పుకోవద్దని డిమాండ్ చేశారు. అక్రమ కేసులతో ఎన్ని రోజులు పాలన చేస్తారో తాము కూడా చూస్తామని హెచ్చరించారు.