Breaking News

ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు కరోనా నెగిటివ్ వచ్చింది. కోవిడ్-19 లక్షణాలతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు.. దాదాపు నెల రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా చేసిన పరీక్షల్లో బాలుకు నెగిటివ్ గా తేలిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. సోమవారం శుభవార్త చెప్తానని ఆయన రెండు రోజుల క్రితమే ఒక ట్వీట్ పెట్టారు. అన్నట్టుగానే చరణ్ స్పందిస్తూ.. ‘నాన్న ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. మరో వారం రోజుల్లో కోలుకుంటారు. ప్రస్తుతానికి నాన్న ఐపాడ్ లో క్రికెట్, టెన్నిస్ చూస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని’ ఆయన పేర్కొన్నారు. బాలుకు కరోనా పాజిటివ్ గా తేలడంతో గత నెల 5 నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. గత వారాంతంలో అమ్మానాన్నలిద్దరూ పెళ్లి రోజు కూడా జరుపుకున్నట్లు చరణ్ వెల్లడించారు. బాలు కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. వెంటిలేటర్ తొలగింపునకు కొంత టైం పడుతుందని, అప్పటివరకు ఆయన పూర్తిగా కోలుకుంటారని చరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.