Breaking News

విప్లవాగ్ని చాకలి అయిలమ్మ

విప్లవాగ్ని చాకలి అయిలమ్మ

‘ఈ భూమి నాది.. పండించిన పంటనాది.. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.. నా పాణం పోయాకే ఈ పంట, భూమిని మీరు దక్కించుకోగలరు’ అంటూ మాటలను తూటాలుగా మల్చుకుని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ. ఆమె వీరత్వం ఎంతో మంది గుండెల్లో ధైర్యం నింపింది. ఎందరికో ప్రశ్నించేతత్వం నేర్పించింది. దేశ్​ముఖ్​లు, భూస్వాములను తరిమికొట్టేలా చేసింది.

1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్యవివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబం. చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. 1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్​ముఖ్​, రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగింది ఐలమ్మ. అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకునే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ఒకరు. ‘దొరా’ అని పిలవకపోతే ఉన్నతకులాలతో పాటు వారి అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాల్లో బయటకు వచ్చేది. వెనకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు.

దేశ్​ముఖ్​లపై తిరుగుబాటు
అయితే మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో నాలుగెకరాలు సాగుచేశారు. పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలిగా చేరింది. పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో అందుకు నిరాకరించింది. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విస్నూర్​ దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది.

వెనకడుగు వేయని ధైర్యం
అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌ పట్వారీని పిలిపించుకుని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేర రాయించుకున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ముఖ్‌లను పంపించాడు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరి సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం వెనుకడుగు వేయలేదు

నీ దొరోడు ఏం చేస్తాడ్రా..!
‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకుంది. నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేతబట్టుకుని గూండాలను తరిమికొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాల్​ విసిరింది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచిపెట్టారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకుని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టారు. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన అయిలమ్మ సెప్టెంబర్ 10, 1985న కన్నుమూసింది

::: ఆర్​కే