సారథి న్యూస్, మెదక్: మంజీరా నది వరదలో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను గురువారం హెలికాప్టర్సహాయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ సమీపంలోని మంజీరా నది పాయల మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో సూపర్వైజర్గా పనిచేసే కొమురయ్య, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే నాగరాజు, దుర్గాప్రసాద్, వాచ్మెన్గా పనిచేసే శ్రీధర్లు రోజు మాదిరిగా విధి నిర్వహణలో భాగంగా మంగళవారం నదిపాయ ఒడ్డున ఉన్న బాయర్ సీడ్ కంపెనీ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లారు. వారితోపాటు కిష్టాపూర్కు చెందిన మహేష్ గేదెలు తప్పిపోగా వాటిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లాడు. వారు మంగళవారం సాయత్రం తిరిగి వచ్చే సమయానికి వర్షం మొదలైంది. దీంతో అక్కడే ఆగిపోయారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో నది ఒడ్డున ఉన్న ఐదుగురు అక్కడే చిక్కుకునిపోయారు.
ప్రాణాలకు ఆపాయం లేకున్నా తినడానికి అక్కడ ఏమి అందుబాటులో లేకపోవడంతో వారు గురువారం 100 నంబర్ కాల్చేసి తమ పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్ ఇన్చార్జ్ ఆర్డీవో సాయిరాం, మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి గురువారం సంఘటన స్థలానికి చేరుకుని నది ఒడ్డున చిక్కుకున్న వారితో మాట్లాడారు. అనంతరం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ఎస్పీ జోయస్డానియల్కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హైదరాబాద్ హకీంపేటలోని ఇండియన్ఏయిర్ఫోర్స్ హెలికాప్టర్ను తెప్పించారు. హెలికాప్టర్సహాయంతో నది పాయ ఒడ్డున చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను సురక్షతంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో గురువారం పొద్దుటి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అంతా ఊపిరిపీల్చుకున్నారు.