![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/dhoni-2-1.jpg?fit=1200%2C750&ssl=1)
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి క్రికెట్ అంటే పిచ్చి అని అతని భార్య సాక్షి వెల్లడించింది. ఆట గురించి ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటాడని చెప్పింది. ఎక్కడున్నా సహచరులకు సాయం చేయడానికి ముందుంటాడని పేర్కొంది. ‘క్రికెట్ ఉంటే ధోనీ వేరే విషయాలు పట్టించుకోడు. ఆట అంటే అతనికి అంత ఆసక్తి. ఒకవేళ ఖాళీ దొరికితే వీడియోగేమ్స్ ఆడుతుంటాడు. ఒత్తిడిని ఉపశమనం పొందడానికి అది ఓ మార్గంగా భావిస్తాడు. ఇటీవల విరామం రావడంతో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. ఇంట్లో ఉంటే కుటుంబంతోనూ ఎక్కువ సమయం గడుపుతాడు. విదేశీ పర్యటనల్లో క్రికెటర్లకు సాయం చేయడానికి మా రూమ్ డోర్ ఎప్పుడూ తెరిచే ఉంచుతాడు. ఏ సమయంలో ఎవరు వచ్చినా సాయం చేస్తుంటాడు. ఆటతోపాటు వ్యక్తిగత విషయాల్లో కూడా మంచి సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. కొన్నిసార్లు తెల్లవారుజామున మూడు, నాలుగు గంటల వరకు కూడా చర్చలు జరుగుతుంటాయి. క్రికెట్కు సంబంధించినవి అయితే నేను అలా బయటకు వెళ్లిపోతా. యువ క్రికెటర్లు కూడా మహీతో ఎక్కువ సేపు ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడున్న క్రికెటర్లంతా ధోనీని చాలా గొప్పగా గౌరవిస్తారు’ అని చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన లైవ్ ఇన్స్టాలో సాక్షి పేర్కొంది. చెన్నై సూపర్ కింగ్స్ అంటే తమ కుటుంబమని చెప్పిన సాక్షి.. ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది.
పాత బైక్లంటే ఇష్టం
ధోనీకి బైక్లంటే చాలా ఇష్టమని సాక్షి వెల్లడించింది. లాక్ డౌన్లో ఏడు బైక్లను అసెంబుల్ చేశాడని తెలిపింది. ఓసారి బైక్ స్టార్ట్ చేస్తే కాలేదని, వెంటనే కొత్త పార్ట్స్ తెప్పించి రిపేర్ చేశాడని చెప్పింది. ఇలా ఇంట్లో ఉన్న బైక్లన్నీంటిని సర్వీస్ చేసి మళ్లీ కొత్త వాటిలా తయారుచేశాడని చెప్పుకొచ్చింది. ధోనీ రిటైర్మెంట్ హాష్ ట్యాగ్స్పై వచ్చిన ఊహాగానాలకు సాక్షి చెక్ పెట్టింది. తాను చేసిన ట్వీట్ గురించి కూడా స్పష్టత ఇచ్చింది. ‘అసలు ఏం జరుగుతుందని మా స్నేహితురాలు అడిగే వరకు నాకు ఈ విషయం తెలియదు. హాష్ ట్యాగ్ను ఎవరు క్రియేట్ చేశారో కూడా తెలియదు. కానీ విపరీతంగా ట్రోల్ అయింది. నేను కూడా దానిని లైక్ చేయడంతో చర్చ రెట్టింపు అయింది. తప్పు తెలుసుకున్న నేను వెంటనే డిలిట్ చేసినా అప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది’ అని సాక్షి పేర్కొంది.