![YSR సన్నిహితుడు కె.వెంకట్రామిరెడ్డి కన్నుమూత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2023/07/bsy.jpg?fit=361%2C490&ssl=1)
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కె.వెంకట్రామిరెడ్డి(82) శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దివంగత వెంకట్రామిరెడ్డికి భార్య భాగ్యమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. సతీమణి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. కుమారులు వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. కాగా, కె.వెంకట్రామిరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా పేరొందారు. రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పేవారని గుర్తుచేస్తుంటారు. గతంలో కాంగ్రెస్ విజయాల్లో కీలకంగా పనిచేశారు. అయితే వైఎస్సార్ ఈ ప్రాంతానికి వస్తే నేరుగా కె.వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లేవారని చెబుతుంటారు. కె.వెంకట్రామిరెడ్డి మృతిచెందడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తంచేశారు.