దుబాయ్: కరోనా కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్ను మొదలుపెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతిజట్టు 14 రోజుల ప్రీ మ్యాచ్ ఐసోలేషన్ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే అన్ని జట్లు మెడికల్ ఆఫీసర్ను నియమించుకోవాలని ఆదేశించింది. మొత్తం నాలుగు దశల్లో క్రికెట్ను పూర్తి స్థాయిలో మొదలుపెట్టనున్నారు. ‘క్రికెటర్లు ఫిట్నెస్ కోల్పోకుండా చిన్నచిన్న కసరత్తులతో ప్రాక్టీస్ మొదలుపెట్టాలి. తర్వాత ఇద్దరు, ముగ్గురుగా గ్రూపు శిక్షణ చేసుకోవచ్చు. మూడో దశలో కోచ్ పర్యవేక్షణలో పదిమంది కలిసి ప్రాక్టీస్ చేయాలి.
నాలుగో దశలో సంఖ్యను పెంచి జట్ల వారీగా ప్రాక్టీస్కు వెసులుబాటు కల్పించింది. శిక్షణ సమయంలో ప్లేయర్లు టాయిలెట్కు వెళ్లకుండా చూడాలి. క్యాప్లు, సన్ గ్లాసెస్ వేరే వాళ్లకు ఇవ్వకూడదు. అంపైర్లు బంతిని పట్టుకోవాలంటే చేతులకు గ్లౌస్లు ధరించాలి. ఆటగాళ్ల మధ్య ఒకటిన్నర మీటర్ల దూరం తప్పనిసరి. వ్యక్తిగత కిట్లు, సామగ్రిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి. నిరంతరం ఉష్ణోగ్రత చెక్ చేస్తూ ఉండాలి. అవసరమైతే కరోనా పరీక్షలు నిర్వహించాలి’ అని ఐసీసీ మెడికల్ కమిటీ వెల్లడించింది.