![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/yuvi-2.jpg?fit=395%2C662&ssl=1)
న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్పై కులం పేరుతో కామెంట్లు చేసిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ శుక్రవారం క్షమాపణ కోరాడు. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశాడు. ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్న యువీ.. చహల్ గురించి మాట్లాడుతూ అతని కులప్రస్తావన తెచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. హర్యానాకు చెందిన ఓ అడ్వకేట్ యువీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, యువీ ట్విట్టర్ వేదికగా సారీ చెప్పాడు. ‘నేను నా మిత్రులతో మాట్లాడేటప్పుడు అనుకోకుండా నోరుజారాను. ఒక బాధ్యతాయుత పౌరుడిగా ఒకవేళ నాకు తెలియకుండానే నేను ఎవరి సెంటిమెంట్లు లేదా ఫీలింగ్స్ను దెబ్బతీసి ఉంటే అందుకు చింతిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. కుల, వర్ణ, వర్గ, లింగ వివక్షపై తనకు విశ్వాసం లేదని, తన జీవితం మొత్తం ప్రజల సంక్షేమం కోసమే అంకితమిచ్చానని అన్నాడు. తాను ప్రతి వ్యక్తి జీవితాన్ని గౌరవిస్తానని, ఈ దేశం పట్ల, ప్రజల పట్ల తన ప్రేమ శాశ్వతమైందని పేర్కొన్నాడు.