న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన బ్యాడ్మింటన్ ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ ను రీషెడ్యూల్ చేశారు. దీంతో వచ్చే జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు ఆక్లాండ్లో నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందు ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు.
‘టోర్నీని విజయవంతం చేసేందుకు మేం కొత్త షెడ్యూల్ను ప్రకటించాం. దీనివల్ల పెద్దసంఖ్యలో జూనియర్ ప్లేయర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. అప్పటివరకు పరిస్థితులు ఆధీనంలోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. ఇండియా తరఫున సైనానెహ్వాల్ మాత్రమే 2008(పుణె)లో వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్ సాధించింది. ఆ తర్వాత ఇంకెవరూ ఈ ఘనత సాధించలేదు. బాలుర విభాగంలో 2015లో సిరిల్ వర్మ రజతం గెలవగా, 2010లో సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్ కాంస్య పతకాలు సాధించారు. గురు సాయిదత్, సమీర్ వర్మ కూడా.. 2008, 2011 టోర్నీల్లో కాంస్యాన్ని గెలిచారు. కెనడాలో జరిగిన 2018 టోర్నీలో లక్ష్యసేన్.. కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.