
- చివరగా తీసిన వీడియో పరిశీలను పంపిన అధికారులు
చెన్నై: తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ నెల8న జరిగిన ఘటనలో తొలి సీడీఎస్ బిపిన్ రావత్ సహా మరో 13మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్ గా మారిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. కోయంబత్తూర్ కు చెందిన జో అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ డిసెంబర్ 8న స్నేహితుడు నాజర్ అతని కుటుంబసభ్యులతో కలిసి కట్టేరి పర్యటనకు వెళ్లారు. వారంతా ప్రమాదం జరిగిన సమయంలో రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిన ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు జో ఆ ఘటనను వీడియోతీశారు. ఏం జరుగుతుందో వారికి అర్థమయ్యేలోగా హెలికాప్టర్ కుప్పకూలినట్లు పెద్దశబ్ధం వీడియోలో రికార్డు అయింది. రావత్ హెలికాప్టర్ వీడియో తీసిన ఫోన్ ను జో నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని కోయంబత్తూర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అక్కడ ఆ వీడియోను విశ్లేషించి ప్రమాద సమయంలో హెలికాప్టర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకోనున్నారు. మరోవైపు దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఫొటోగ్రాఫర్ జో అతని స్నేహితుడు వెళ్లడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వన్యప్రాణుల సంచారం కారణంగా మనుషులను నిషేధించిన ప్రాంతంలోకి వారు ఎందుకు వెళ్లారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.