టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
న్యూఢిల్లీ: త్రోడౌన్స్ వల్ల పేస్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొంటున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కొన్నేళ్లుగా ఇందులో తమ ప్రదర్శన చాలా మెరుగుపడిందన్నాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర దీనికి కారణమని కితాబిచ్చాడు. ‘కొన్నేళ్లుగా మేం పేస్ బౌలింగ్ను ఎలాంటి భయం లేకుండా ఆడుతున్నాం. 155 కేఎంపీహెచ్ వేగంతో వచ్చిన బంతులను కూడా అద్భుతంగా ఎదుర్కొంటున్నాం. చాలా పురోగతి కనిపిస్తోంది. దీనికి కారణం రఘు అని తెలుసు. ఫుట్ వర్క్, ఆటగాళ్ల బ్యాట్ మూమెంట్ కు సంబంధించి రఘు వద్ద మంచి టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి సైడ్ ఆర్మ్ కాన్సెప్ట్. దీనివల్ల బాల్ అత్యధిక వేగంతో వస్తుంది. అందుకే మేం నెట్స్ లో రఘు త్రోడౌన్స్ ఆడిన తర్వాత క్రీజులో ఎంత వేగంగా వచ్చే బంతి అయినా తక్కువగానే కనిపిస్తుంది’ అని కోహ్లీ వివరించాడు. చాలా ఏళ్లుగా రఘు.. టీమిండియా సహాయక సిబ్బందిలో కీలక వ్యక్తిగా మారాడన్నాడు.
సైడ్ ఆర్మ్ అంటే..
క్రికెట్ పరికరాల్లో సైడ్ ఆర్మ్ కూడా ఒకటి. లాంగ్ స్పూన్ మాదిరిగా ఉండి..చివరిలో బంతిని పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇందులో బంతిని వేసి విసిరితే రెట్టింపు వేగంతో దూసుకెళ్తుంది. దాదాపు 150, 155 కేఎంపీహెచ్ వేగంతో బంతులు వస్తాయి. అంటే మ్యాచ్లో బౌలర్లు విసిరే వేగం కంటే ఎక్కువే. అందుకే నెట్స్ లో బ్యాట్స్మెన్స్ ఎక్కువగా దీనితోనే ప్రాక్టీస్ చేస్తారు.